బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. తక్షణమే శాసన మండలి చైర్మన్ రాజీనామా చేయాలని కోరారు. ఈ విషయాన్ని చర్చించాక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు కర్ణాటక శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి. ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా తన పదవీ కాలం జూలై 2028 వరకు ఉంది. 1956 నుండి ఏ చైర్మన్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాలేదని, అందరూ తమ పదవీకాలాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు హొరట్టి, తనను తొలగించడానికి ఎటువంటి కారణాలు లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనను రాజీనామా చేయమని కోరారని, ఈ విషయంపై బీజేపీ , జేడీ(ఎస్) నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
శాసనమండలి చైర్మన్ , అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక అనేది సభకు సంబంధించిన హక్కు అని, అది రాజకీయ పార్టీ హైకమాండ్ నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో హొరట్టి ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా సలీం అహ్మద్ను, డిప్యూటీ చైర్మన్గా ఉమాశ్రీని నామినేట్ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలుపుతూ సీఎం శివకుమార్కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది; ఆగస్టు 3న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా కూడా ఇందులో ఉంది. అలాగే, కర్ణాటక శాసనసభ స్పీకర్గా జి.ఎస్. పాటిల్ , డిప్యూటీ స్పీకర్గా ఎ.ఎస్. పొన్నన్న పేర్లను కూడా పార్టీ ఆమోదించింది.
కొత్త చైర్మన్ కోసం పార్టీ ఒక పేరును పంపినందున, ఇబ్బందికర పరిస్థితులను నివారించడానికి రాజీనామా చేసి సహకరించాలని ముఖ్యమంత్రి తనకు ఫోన్ చేసి కోరారన్నారు. నేను ప్రతిపక్ష నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హొరట్టి మీడియాతో చెప్పారు. శాసనమండలి చైర్మన్ లేదా అసెంబ్లీ స్పీకర్ను సభ మాత్రమే ఎన్నుకోవాలి తప్ప, ఏ పార్టీ అధిష్టానమో నిర్ణయించ కూడదని హొరట్టి స్పష్టం చేశారు.















