హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత తన శాసన మండలి సభ్యురాలి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించి శాసన మండలి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మండలి కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున 2021 డిసెంబరులో రెండోసారి ఎన్నికయ్యారు. 2022 జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు.
ఇదే సమయంలో తనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్పటి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఉన్నారని కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో ఆప్ కు చెందిన మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేతలు ఇప్పుడు జైలులో కాలం గడుపుతున్నారు. ఇదేక్రమంలో కవితకు కూడా ప్రమేయం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు పేర్కొనడం, ఆ తర్వాత తనను అరెస్ట్ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా కవిత సంచలనంగా మారారు. తన అరెస్ట్ కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా నష్టం జరిగిందని ఆ పార్టీకి చెందిన శ్రేణులు భావించారు, పలు సందర్భాలలో ఆరోపించారు కూడా. దీంతో బయటకు వచ్చిన కవిత ధిక్కార స్వరం వినిపించారు.















