నాగర్ కర్నూల్ జిల్లా : తనది పాలమూరేనంటూ తిరిగి వలస జిల్లాగా మార్చేశాడని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నాగర్ కర్నూల్ జిల్లా సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు . పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధం అవుతున్నారని ప్రకటించారు. రైతు బంధు పోయి ‘రాబందు’ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. యూరియా క్యూలైన్లే ఇందుకు నిదర్శనం అన్నారు కేటీఆర్. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పండ బెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయట పడిందన్నారు. బంగారంలాంటి తెలంగాణను రేవంత్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆవేదన చెందారు.
పాలమూరు జిల్లాను మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేక పోయిందన్నారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు పిలిచిన టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన ఆరోపించారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని నిప్పులు చెరిగారు.
