హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు రాష్ట్ర సర్కార్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదని, రాష్ట్రాన్ని దివాలా తీసేలా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో అక్రమంగా జరిగిన గనుల ఈ-ఆక్షన్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో అక్రమ టెండర్లపై రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు చెప్పారు. గనుల ఈ-ఆక్షన్ ప్రక్రియలో చట్టపరమైన ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఈ గనుల టెండర్లలో భాగమై ఉందన్నారు. ఆ మాత్రం సోయి లేకుండా ఎలా ఈ టెండర్లను ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు. వెంటనే పునరాలోచించు కోవాలని సూచించారు.
చట్ట ప్రకారం తప్పనిసరిగా వెల్లడించాల్సిన DGPS డీమార్కేషన్, ఖచ్చితమైన జియో-కోఆర్డినేట్లు, ఫారెస్ట్ కంపార్ట్మెంట్ వివరాలు, జియాలజికల్ నివేదికలు వెల్లడించ లేదని ఆరోపించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు పొంది పర్చిన తర్వాతనే ఈ టెండర్లను పిలవాలని సూచించారు కేటీఆర్. ఎంపిక చేసిన బిడ్డర్ల (డెక్కన్ సిమెంట్స్, NCL ఇండస్ట్రీస్) చరిత్ర కూడా పలు అనుమానాలను లేవనెత్తుతుతోందని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఈ వివాదాస్పద ఈ-ఆక్షన్ ప్రక్రియను నిలిపివేసి, అక్రమ టెండర్లను రద్దు చేసి, ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.
