పాలమూరు జిల్లా : గత కొంత కాలంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడం, ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ తో లింకు ఉందంటూ ప్రత్యేక కథనం ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఎన్టీవీలో ప్రసారం అయ్యింది. దీనిపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిని ఆధారంగా చేసుకుని ఎన్టీవీతో పాటు ఇతర డిజిటల్ మీడియా ఛానల్స్ పై కూడా విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి డీజీపీ శివ ధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగారు సీపీ. ఈ మేరకు ఆయన అరెస్ట్ ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అరెస్ట్ అయిన ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, పూర్ణాచారి, సుధీర్ లను కోర్టు ముందు హాజరు పరిచారు. ఆ వెంటనే వారికి బెయిల్ దొరికింది. ఈ తరుణంలో కోమటి రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడి లాంటి కోమటిరెడ్డిపై వీడియోలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కోమటిరెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారంతో తాను మూడు రోజులుగా తిండి కూడా తినలేకపోతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో విచారణ జరుగుతోందన్నారు.
