Koil Alwar : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ (Koil Alwar) తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
Koil Alwar Tiruchanoor Interesting
హైదరాబాద్ కు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మ వారి ఆలయంలో 7 పరదాలను, అదేవిధంగా తిరుపతికి చెందిన శ్రీ మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో ఎం. రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : TTD EO Anil Kumar Important Update : అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి రాక



















