కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు

జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ తో సీఎం భేటీ

hellotelugu-CM

హైద‌రాబాద్ : విద్యా రంగంలో కీల‌క‌మైన మార్పులు తీసుకు వ‌స్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. త‌న‌తో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్కిషోర్ మక్వానా. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కొత్త‌గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కూల్ లోనే అందిస్తున్నాం చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టామ‌ని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే నిధులు కూడా మంజూరు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు జాతీయ ఎస్సీ చైర్ ప‌ర్స‌న్ కు.

వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని వెల్ల‌డించారు సీఎం. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశాం అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో భాగంగానే బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కూల్ లోనే అందిస్తున్నాం అని వెల్ల‌డించారు సీఎం. విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న ప్రాంతంలో మొదటగా వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంఖ్యను పెంచుతున్నాం అని తెలిపారు .

రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నాం అని స్ప‌ష్టం చేశారు సీఎం. రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించాం అని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని జాతీయ ఎస్సీ చైర్ ప‌ర్స‌న్ ను కోరారు.

Exit mobile version