తిరుమల : చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థ అయిన ఐకాయ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ వద్ద ఉన్న భూ ఆస్తుల ద్వారా ఆదాయం పొందేందుకు ఆర్ఈఐటీల ఏర్పాటులోనూ, అలాగే ట్రస్ట్ ఆధీనంలో ఉన్న బంగారాన్ని ధృవీకరించడం, దాని విలువను లెక్కించడంలోనూ టీటీడీకి సహాయ పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అధికారిక నిర్వాహక సంస్థ అయిన టీటీడీ కోసం నవీకరించబడిన అకౌంటింగ్ మాన్యువల్ను రూపొందించే ప్రక్రియను ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐకాయ్) దాదాపు పూర్తి చేసే దశకు తీసుకు వచ్చింది. అకౌంటింగ్ మాన్యువల్, ఆర్ఈఐటీల ఏర్పాటు , బంగారు ఆస్తుల విలువ నిర్ధారణ వంటి అంశాలపై టీటీడీతో కలిసి పనిచేస్తున్నట్లు సదరు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆర్ఈఐటీలు సంస్థలకు తమ రియల్ ఎస్టేట్ ఆస్తుల ద్వారా ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తాయి; టీటీడీ వద్ద భక్తులు విరాళంగా ఇచ్చిన భారీ భూభాగాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో టీటీడీ కోసం అకౌంటింగ్ మాన్యువల్ తయారీ పని తుది దశలో ఉందని ఐకాయ్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ డి తెలిపారు. టీటీడీ ప్రాజెక్ట్ ఇతర ప్రధాన ఆలయాలకు ఒక నమూనా ప్రాజెక్ట్గా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్లో అకౌంటింగ్ విధానం , ప్రమాణాలు , అకౌంటింగ్ విధానాల వర్తింపు వంటి అంశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా, తమ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలని టీటీడీ కోరుకుంటోందని తెలిపారు. టీటీడీ వద్ద మూడు దశాబ్దాల క్రితం రూపొందించిన అకౌంటింగ్ మాన్యువల్ ఉండేది. ప్రస్తుతం ఆ మాన్యువల్ను ఇన్స్టిట్యూట్ నవీకరిస్తోంది. టీటీడీ కోసం రూపొందించే విధానపరమైన మార్గదర్శకాలను దేశంలోని ఇతర ఇలాంటి ట్రస్టులు లేదా సంస్థలు కూడా అనుసరిస్తాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
