హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా శాంతి మార్గమని అన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని గుర్తు చేశారు. తాము తీసుకు వచ్చిన ఈ సంస్కరణలు , పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా చేశాయన్నారు.
అంతే కాకుండా క్రిస్మస్ పర్వదినాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సెక్యులర్ సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. పీడన నుంచి విముక్తి లభించేలా దీవిస్తూ, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఏసు క్రీస్తును కేసీఆర్ ప్రార్థించారు. పరమత సహనం అనేది ప్రతి ఒక్కరికీ ఉండాలని సూచించారు. పరమత సహనం కలిగి ఉండాలని, ఇదే ప్రతి మతం బోధిస్తుందని స్పష్టం చేశారు. సాటి వారికి సేవ చేసే గుణంతో పాటు ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని అన్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.


















