హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఎన్నికల నేపథ్యంలో చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల ఎంపిక ఉత్కంఠను రేపింది. చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. తాజాగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుల సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు జిన్నారం 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శిల్పా నాగరాజు. పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వతంత్ర అభ్యర్థులు సైతం బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్ట బోతుందని స్పష్టం చేశారు గూడెం మహిపాల్ రెడ్డి, శంబీపూర్ రాజు. ఇందుకు సంపూర్ణ సహకారం అందించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు.. పూర్తి విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్, కృష్ణ, గోవింద్, మచ్చేందర్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.















