Jemimah Rodrigues : ముంబై : కళ్ల ముందు భారీ లక్ష్యం అయినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో చరిత్ర సృష్టించారు భారత మహిళా క్రికెటర్లు. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ లో ఏడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి రికార్డు నమోదు చేశారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనున్నారు. ముంబై బీవై పాటిల్ వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరు ఆద్యంతం ఆసక్తిని రేపింది. ఎవరూ ఊహించని రీతిలో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues), కెప్టెన్ కౌర్ లు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తమకు ఎదురే లేదని చాటారు.
Jemimah Rodrigues Sensational Game
జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) చివరి దాకా మైదానంలో ఉంటూ భారత్ ను విజయ తీరాలకు చేర్చింది. తనతో పాటు కెప్టెన్ కౌర్ తో కలిసి 167 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. హర్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్ చేయగా జెమీమా 127 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా 8వ సారి కప్ ఎగరేసుకు పోవాలని కన్న కలలపై నీళ్లు చల్లింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికంగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఘనతను భారత జట్టు స్వంతం చేసుకుంది.
జెమీమా 134 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 127 రన్స్ చేయగా హర్మన్ ప్రీత్ కౌర్ 88 బాల్స్ లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో చెలరేగి పోయారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. భారత మహిళా జట్టు ముందు 339 రన్స్ భారీ టార్గెట్ ను ముందుంచింది. ఆసిస్ టీమ్ లో లిచ్ ఫీల్డ్ 93 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు 3 సిక్స్ లతో 119 రన్స్ చేసింది. పెర్రీ 88 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ లతో 77 రన్స్ చేసింది. ఆష్లే గార్డ్ నర్ 45 బంతుల్లో 63 రన్స్ చేసింది. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి.
Also Read : Minister Savitha Important Update : రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి
