Jagadish Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బనకచర్ల అంశంలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిన్న సీఎం మాట్లాడిన తీరు బాబు ప్రసంగానికి కొనసాగింపు మాత్రమేనని పేర్కొన్నారు. గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నామని చెప్పాల్సింది పోయి మౌనంగా ఉండడం దారుణమన్నారు. ఆదివారం జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటాలు చేసి కోరి కొనితెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు దొంగలు పడ్డారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా కేసీఆర్ గుర్తింపు పొందారని ఆ విషయం తెలుసు కోకుండా రేవంత్ రెడ్డి నోరు పారేసు కోవడం దారుణమన్నారు జగదీశ్ రెడ్డి.
Ex Minister Jagadish Reddy Slams CM Revanth Reddy
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరడంతో రెచ్చి పోతున్నారని, కేసీఆర్ ఉన్నంత వరకు బాబు పరివారం కిమ్మనకుండా ఉన్నారని, ఇప్పుడు లేచి ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు జగదీష్ రెడ్డి. ప్రజా ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలలో అభివృద్ది చేసిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణ రాష్ట్ర పరువుకు భంగం కలిగించేలా పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చూస్తూ ఊరుకోరన్నారు మాజీ మంత్రి.
Also Read : Rahul Gandhi Shocking Tour : బీహార్ లో రాహుల్ ఓట్ అధికార్ యాత్ర















