హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కీలక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో అబద్దపు హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. పొద్దస్తమానం తనపై ఆడి పోసుకోవడం, తన చావును కోరుకోవడం తప్పా ప్రస్తుత ప్రభుత్వం చేసింది ఏముందో చెప్పాలన్నారు కేసీఆర్. ప్రజల కోసం ఒక్క ప్రయోజనకరమైన పాలసీని తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు కేసీఆర్. ఇదేనా మీరు చెప్పిన ప్రజా పాలన అని సూటిగా నిలదీశారు. ఒకరు చని పోవాలని కోరుకుంటే తాను చని పోనని అన్నారు. అది వారి సంస్కారానికి, విజ్ఞతకే వదిలి వేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన కొనసాగడం లేదన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని ధ్వజమెత్తారు కేసీఆర్.
నాలుగు కోట్ల ప్రజానీకం ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకోలేదన్నారు. పది ఏళ్ల పాటు ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చిన తెలంగాణను ముక్కలు చేయడమే లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను బతికి ఉన్నంత వరకు తెలంగాణ పై ఏ ఒక్కరి కుట్రలు, కుతంత్రాలకు తావు ఇచ్చే ప్రసక్తి లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమై పోయాయని వాపోయారు కేసీఆర్. నన్ను దూషించడమే ఇప్పుడు ఉన్న సర్కార్ కు పనిగా మారిందంటూ ఎద్దేవా చేశారు. స్తానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న హస్తం పార్టీ కంటే గులాబీ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయని, కానీ దానిని కూడా జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఇకనైనా భ్రమల్లో కాకుండా వాస్తవంలోకి రావాలని హితవు పలికారు.



















