Indian Railways : భారతీయ రైల్వేలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా కృషి కొనసాగుతున్నదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. లోక్సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS)లో పెద్దమొత్తంలో మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వ్యవస్థ నిమిషానికి సుమారు 25,000 టిక్కెట్లు బుక్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉందని, ఈ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సాంకేతికతలో అనేక అభివృద్ధులు చేపట్టుతున్నట్లు చెప్పారు. PRS అప్గ్రేడేషన్ పై వచ్చిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా స్పందించిన మంత్రి, ఇది భారతీయ రైల్వేల్లో ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
Indian Railways – సాంకేతికత ఆధారంగా సమగ్ర అభివృద్ధి
అప్డేట్లో భాగంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ పరికరాలు, భద్రతా వ్యవస్థలు, కార్యాచరణల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు. ఈ ఆధునీకరణతో భవిష్యత్తులో వచ్చే అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలు పనిచేసేలా మారుస్తామని వివరించారు.
మొబైల్ టికెటింగ్లో మెరుగుదల
మొబైల్ టికెటింగ్ సేవలలోనూ సంస్కరణలు జరుగుతున్నట్లు వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే నాలుగు రెట్లు ఎక్కువ వినియోగదారులను నిర్వహించగల నూతన వ్యవస్థను రూపొందించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్ల వ్యయంతో మంజూరైనట్లు తెలిపారు.
అలాగే, రైల్వేలు ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వన్ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్ల నుంచే రిజర్వేషన్ టిక్కెట్లు మరియు సాధారణ టిక్కెట్లు బుక్ చేసుకునే వీలును పొందుతున్నారని పేర్కొన్నారు.
పండుగల సమయంలో బుకింగ్ కు భారీ డిమాండ్
పండుగ సీజన్లో రైలు ప్రయాణానికి డిమాండ్ భారీగా పెరగడం సాధారణమని, ముఖ్యంగా దుర్గాపూజ, దసరా, దీపావళి, ఛత్ పండుగల సమయంలో వలసదారులు స్వస్థలాలకు తిరిగిపోతారని గుర్తు చేశారు. గత సంవత్సరం టికెట్ బుకింగ్ ముందస్తు గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించినప్పటికీ, తాజా డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని మంత్రి సూచించారు.
Also Read : OpenAI Huge Extension : చాట్ జిపిటి మాతృ సంస్థ ‘ఓపెన్ఏఐ’ త్వరలో భారత్ లో భారీ పెట్టుబడులు
