న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏఐ పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా వీటిని పర్యవేక్షించేందుకు గాను భారత దేశానికి వార్ రూమ్ అనేది ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో హైదరాబాద్ భారతదేశం కోసం ఏఐ వార్-రూమ్ను నిర్మించేందుకు సిద్దంగా ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. పరిశోధనపై ప్రత్యేక దృష్టితో అత్యున్నత సౌకర్యాలతో ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఏఐ విశ్వ విద్యాలయాన్ని మనం స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏఐ విప్లవంలో ముందుండాలంటే మనం ముందుగగా చిప్ లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. మొత్తం సరఫరా గొలుసులో భాగం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాన్ని అంచనా వేయడానికి మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే సమయం మించి పోయిందని, ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే పనికి ఉపక్రమించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాకుండా ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వ్యక్తులను తిరిగి నైపుణ్యం చేయడానికి మనం భారీగా పెట్టుబడి పెట్టాలని అన్నారు . ఇందు కోసం ఏఐ స్టార్టప్ లకు ప్రోత్సాహం కల్పించాలని పేర్కొన్నారు.

















