న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన, పరివర్తనాత్మక పురోగతి నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో అత్యున్నత జాతీయ సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రర మోదీని కోరారు. ముఖ్యంగా జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాల విషయాలలో దుర్వినియోగాన్ని నిరోధించడానికి బలమైన చట్ట పరమైన రక్షణలను రూపొందించడానికి అంకితమైన ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనకు ఏఐని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించు కోవాలని నొక్కి చెప్పారు.
ఇదే క్రమంలో ఏఐ అభివృద్ధికి సంబంధించిన అన్ని డొమైన్లలో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ప్రపంచ నాయకులను, సాంకేతిక నిపుణులను ఆహ్వానించారు. భారత ప్రభుత్వ మద్దతుతో దేశం కోసం ఏఐ స్టార్టప్ విలేజ్ను స్థాపించడానికి రాష్ట్రం సంసిద్ధతను ఆయన ప్రకటించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో వార్షిక చర్చలు సరిపోవని పేర్కొంటూ, వివిధ భారతీయ నగరాలు నిర్వహించే ద్వివార్షిక ఏఐ శిఖరాగ్ర సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు . స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి , భారతదేశ యువత ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వ యునికార్న్ సంస్థలను నిర్మించడానికి వీలుగా జాతీయ ఏఐ నిధిని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
















