హైదరాబాద్ : సింగరేణిలో స్కాంలు తప్ప స్కీములు ఏమీ లేవన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.
నా పైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాను సింగరేణి కార్మిక సంఘం మీటింగ్ లో మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం అయిందని హరీష్ రావు చెప్పారన్నారు. అదే విషయాన్ని తాను ప్రస్తావించడం జరిగిందన్నారు. నాపైన కేసు పెట్టాలని డీజీపీకి ఫిర్యాదు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నాపైన పెట్టే దృష్టి సింగరేణిపై పెట్టాలని సర్కార్ కు హితవు పలికారు. సింగరేణిని సీఎం బామ్మర్దికి అప్పగించారని ఆరోపించారు.
నాపైన తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు ఉన్నాయన్నారు బాల్్క సుమన్. సీసీఎస్ డార్క్ సెల్ తో సహా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్నానని తెలిపారు. సింగరేణి కార్మికులు, ప్రజల ఓట్లతో నేను రెండు సార్లు గెలిచానని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి నా వ్యాఖ్యలను చీప్ ట్రిక్ కింద వాడారన్నారు బాల్క సుమన్. నాపైన కేసు పెడితే పెట్టుకోండి. నాకు కేసులు ఓ లెక్క కాదన్నారు. సీఎం కార్యాలయం డైరెక్షన్ మేరకు నన్ను ట్రోల్ చేస్తున్నారంటూ ఆరోపించారు. మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమోనని ఆవేదన చెందారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నన్ను ఇబ్బందులు పెట్టి జైలుకు పంపారని ఫైర్ అయ్యారు. మరి ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డిపై పై కేసు పెట్టారా అని నిలదీశారు.
