హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్ను నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. మొండి కుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 2200 ల కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా రక్షించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో ఈ మేజర్ ఆపరేషన్ హైడ్రా చేసింది. సర్వే నంబరు 53లోని మొండికుంటతో పాటు.. సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమి ఎకరాలకొద్దీ ఆక్రమణలకు గురి అవుతోందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలమేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపు ఇలా పలు రకాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు.
