హైదరాబాద్ : భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తమ పార్టీ, జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి దురుద్దేశ పూర్వకంగా ఆయా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లలో కథనాలు రావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఆధారాలు లేకుండా ఎలా ప్రసారం చేస్తారంటూ ప్రశ్నించారు. మీడియా నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తమ ప్రభుత్వం పూర్తిగా ప్రజా పాలన సాగిస్తోందని, పూర్తి పారదర్శకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నా కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు .
ప్రధానంగా మంత్రులపై ఆఫ్ ద రికార్డులు, జర్నలిస్టుల అరెస్టులు తనను మరింత బాధకు గురి చేసేలా చేశాయన్నాడు ఎంపీ. నాయకులు తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా.. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేసినా వార్తలు రాయడంలో తప్పు లేదన్నారు. కానీ ఆఫ్ ది రికార్డ్ అంటూ లేనిపోని, కల్పిత కథలు అల్లి, జనంలో మరింత ఉత్సుకత కోసం, అడ్డమైన రేటింగ్ ల కోసం ఇలాంటి చిల్లర వార్తలు వేయొద్దని కోరారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే ఒక మంత్రి బయటకు వచ్చి నాకు విషమిచ్చి చంపండి అని అనే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధ పడ్డాడో తెలుస్తుందన్నారు. ఇకనైనా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు ఎంపీ.
