హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతారా అంటూ మండపడ్డారు. జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవార్డులు తప్పకుండా వస్తాయంటూ మండిపడ్డారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేస్తూ సంతకం చేసింది నిజమేనని ఆరోపించారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడు బయపెట్టిందే నేను అని వెల్లడించారు. యూపీఏ సర్కార్ చేసిన విభజన చట్టం పరిమితులవల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవం అన్నారు.
కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించి బచావత్ ట్రైబ్యునల్ను టచ్ చేయరాదని ఆ చట్టంలో పేర్కొన్నారని అన్నారు. తెలంగాణాకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దిందని అన్నారు. కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసేలా అవకాశం కల్పిస్తూ కొత్త ట్రైబ్యునల్ కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించక పోతే ఈ అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన నీటి వివరాలు ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డీపీఆర్ ను కేంద్రం వెనక్కు పంపిందన్నారు. సమగ్ర వివరాలతో కేంద్ర గైడ్ లైన్స్ తో డీపీఆర్ పంపకుండా కేంద్రం నిధులిస్తుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
















