అమరావతి : ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత షీలా నగర్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు కేవీ రమణను పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై దాడి ఘటనలో వెంకటరమణకు గాయాలు అయ్యాయి.కేవీ రమణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ పై దాడి జరగడం దురదృష్టకరం అన్నారు. హోంగార్డ్ వెంకటరమణను కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారని చెప్పారు. .
వైద్యుల పర్యవేక్షణలో వెంకటరమణ చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశాం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు అనిత. ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని పేర్కొన్నారు. పోలీసులు తమ పని తాము చేసుకునే లాగా ప్రజలు కూడా సహకరించాలని కోరారు . పోలీసుల పట్ల ఎవరు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చచూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వంగలపూడి అనిత.

















