హైదరాబాద్ : భువనగిరికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై స్పందించారు ఎంపీ. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును తప్పు పట్టలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు . బిఆర్ఎస్ సంబురాలు చేసుకునే విధంగా కోర్టు తీర్పులో ఏముందని అన్నారు. హైకోర్టు తీర్పు కాపీలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిన తర్వాత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని కమీషన్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం ఇదే అంశాన్ని చెప్పిందన్నారు.
పీ.సీ.ఘోష్ కమీషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ చేయాలని ప్రభుత్వం అడగ లేదన్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది తప్పా, కరెక్టా బీజేపీ చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీకి బాధ్యత పెరిగిందన్నారు ఎంపీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీకి క్లిన్ చిట్ వచ్చిందా లేదా అనేది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ.
