చెన్నై : తమిళనాడు చలన చిత్ర పరిశ్రమకు నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తాజాగా ఓపెన్ అయ్యింది. తనతో కలిగిన బంధం విష పూరితంగా మారిందన్నారు. అయితే తన మాజీ భాగస్వామి పేరును బయట పెట్టక పోవడం గమనార్హం. గతంలో ఆమె పేరు నటుడు ధృవ్ విక్రమ్తో ముడిపడి వినిపించినప్పటికీ, ఈ బంధం గురించి మాట్లాడేటప్పుడు ఆమె తన పేరును ప్రస్తావించలేదు. నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశలలో ఒకదాని గురించి బహిరంగంగా మాట్లాడటం కలకలం రేపింది. తాను దాదాపు రెండేళ్లపాటు అహంకార పూరితమైన , మానసికంగా వేధించే బంధంలో గడిపానని ఆమె వెల్లడించారు. యూట్యూబ్లో ధన్యా వర్మతో జరిగిన ఒక ముఖాముఖిలో తాను ఈ అనుభవాన్ని పంచుకోవడం కేవలం ప్రచారం కోసం కాదని, ఇలాంటి వేధింపులను గుర్తించలేక మౌనంగా బాధపడుతున్న వారిలో అవగాహన కల్పించడానికేనని అనుపమ పరమేశ్వరన్ చెప్పారు.
నార్సిసిస్టిక్ వేధింపులను గుర్తించడం తరచుగా కష్టమని వాపోయారు. ఎందుకంటే ఇందులో ఎప్పుడూ అరవడం లేదా శారీరక హింస ఉండక పోవచ్చని ఆమె వివరించారు. తన విషయంలో, ఆ బంధం మొదట్లో విపరీతమైన ప్రేమ ప్రదర్శనతో ప్రారంభమై, క్రమంగా ఆప్యాయత, శ్రద్ధ స్థానంలో నియంత్రణ, మానసిక మానిప్యులేషన్ చోటు చేసుకున్నాయని కన్నీటి పర్యంతం అయ్యారు. చివరికి తన మాజీ భాగస్వామి తన దుస్తుల ఎంపికతో సహా తన జీవితంలోని అనేక అంశాలను నియంత్రించడం ప్రారంభించారని ఆవేదన చెందారరు. ఒక దశలో తాను ధరించే దుస్తుల ఫోటోలను ఆమోదం కోసం పంపాల్సి వచ్చేదని ఆమె చెప్పారు. తన వృత్తిపరమైన జీవితం కూడా దీనివల్ల ప్రభావితమైందని, డ్రాగన్ వంటి సినిమాల ప్రచారంలో పాల్గొనడానికి కూడా తనకు అనుమతి ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు.
స్నేహితులు , కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించి ఆ బంధం నుండి బయట పడమని సూచిస్తారేమోనన్న భయంతో తాను వారందరికీ దూరంగా ఉంటూ ఒంటరితనాన్ని ఎంచుకున్నానని అనుపమ చెప్పారు. తాను నిరంతరం అనిశ్చితిలో జీవిస్తున్నానని, ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, తన భాగస్వామి ప్రవర్తనలో మరో మార్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిని ఆమె వివరించింది. వేధింపుల చక్రం పునరావృతమైందని బాంబు పేల్చింది అనుపమ పరమేశ్వరన్.
