Harish Rao : నాగర్ కర్నూల్ జిల్లా – మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 100 మంది గురుకుల విద్యార్థులు చని పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత మంది చనిపోతే నీ రాతి గుండె కరుగుతుంది అంటూ ప్రశ్నించారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు మంచి భోజనం పెట్టక పోవడం దారుణమన్నారు. ఓ వైపు పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రి పాలవుతున్నా సీఎం పట్టించు కోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో గురుకుల విద్యార్థులను పరామర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో డ్రామాలు ఆపి పిల్లల బాగోగులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సొల్లు కబుర్లు తప్పా రాష్ట్రానికి, ప్రత్యేకించి విద్యా రంగానికి చేసింది ఏమీ లేదన్నారు హరీశ్ రావు.
MLA Harish Rao Slams CM Revanth Reddy
గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించాలని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తికి విన్నవించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్లో తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేటు భోజనం ఖర్చు చేశారని, కానీ గురుకులాల్లో మాత్రం కలుషిత ఆహారం పెడుతున్నా , ఆస్పత్రి పాలవుతున్నా కనికరించడం లేదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు మార్చడం అంటే గురుకులాల పిల్లలను పొట్టన పెట్టుకోవడమా రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు రెండు సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టింది లేదన్నారు. తన నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి పోయిందన్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెంలలో విషాహారం తిని ఆసుపత్రి పాలైతే, హుస్నాబాద్ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
Also Read : Minister Bandi Sanjay Warning : బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటాం
















