హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రాష్ట్ర జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ సందర్బంగా సీఎంకు సుదీర్ఘ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో 7న లేఖ రాసినా పట్టించు కోలేదన్నారు. అందువల్లే పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయ్యిందన్నారు. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి చేరుకుందన్నారు. ఏపీ 74% వినియోగిస్తే, తెలంగాణ 25% పరిమితం అయ్యిందన్నారు హరీశ్ రావు. రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు ఏర్పడిందన్నారు. అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరారు . కాళేశ్వరం, దేవాదుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా
జల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్తో పాటు దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని వాపోయారు.
భారీ మోటార్లను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే మేం హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్కో సూచించడం వల్ల, భారీ పంపులను తరచూ స్టార్ట్, స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
