హైదరాబాద్ : లంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) అధ్యక్షుడు సలావుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు నూతన సంవత్సరం సందర్బంగా ఖుష్ కబర్ చెప్పారు. వాహనదారులకు తీపి గుర్తు ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నారు .నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మద్యం సేవించిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరలేని వ్యక్తుల కోసం ఉచిత రవాణా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత రైడ్ సేవలు డిసెంబర్ 31 రాత్రి 11:00 గంటల నుండి జనవరి 1 రాత్రి 1:00 గంటల వరకు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమం గురించి షేక్ సలాహుద్దీన్ వివరించారు. పండుగల సమయంలో మద్యం మత్తులో వాహనాలు నడపడం డ్రైవర్లు , పాదచారులకు తీవ్రమైన ప్రమాదంగా మారుతోందని అన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో హమ్ ఆప్కే సాథ్ హై అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నూతన సంవత్సరం సందర్భంగా ఆటో రిక్షాలు , నాలుగు చక్రాల వాహనాల ద్వారా టిజిపిడబ్ల్యుయు ఉచిత రైడ్ సేవలను అందిస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం, బిజ్లిరైడ్ తో భాగస్వామ్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం అన్నారు. ఎలక్ట్రిక్ రెండు చక్రాల వాహనాల వినియోగం, వేగవంతమైన లాస్ట్-మైల్ స్పందన, సమన్వయంతో కూడిన గ్రౌండ్ సపోర్ట్ ద్వారా పీక్ న్యూ ఇయర్ సమయాల్లో ఎక్కువ మందిని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నాం అన్నారు. ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరాలన్నదే తమ ఏకైక ఉద్దేశమని స్పష్టం చేశారు సలావుద్దీన్.


















