జోగులాంబ గద్వాల జిల్లా : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. ఆయన గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవులు నివాసంలో సమావేశం అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. అనంతరం వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ నుండి ఎవ్వరు నిలబడినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు వి. శ్రీనివాస్ గౌడ్.
గతంలో మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎందులో విఫలమైందో చెప్పాలని అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, కానీ కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం కారణంగా పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కేవలం 10 శాతం పనులు పూర్తయింతే వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఇప్పటికైనా కమీషన్ల కోసం కాకుండా అన్నదాతలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పనులు ప్రారంభించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.















