హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటికి మొన్న కోస్గి సభ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పు తీసుకొని తన్నాలి అనిపిస్తుందని , కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఆ పని చేయలేక పోతున్నామని అన్నారు. కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉందని చెప్పారు. తాను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదట అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదాం అన్నారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొప్పిరా నాయన అంటూ మండిపడ్డారు కేటీఆర్. నేను ప్రపంచమంతా చదువుకున్నా, నీ లెక్క సదువు సంధ్య లేకుండా తిరగలేదంటూ ఫైర్ అయ్యారు. మీ అమ్మ నాయన నీకు సక్కగ తోవ చూపియ్యకపోతే నా తప్పా అని ప్రశ్నించారు. కే చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని అధికారం నుండి దూరం చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రతిజ్ఞపై స్పందిస్తూ, దానికి బదులుగా తన ఎన్నికల హామీలను నెరవేరుస్తానని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తను ఉపయోగించిన ‘తిట్లు, భాష’పై రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు.



















