హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ఏం మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలనే సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు. జనం ఆయనను చూసి , కామెంట్స్ ను జోక్ గా తీసుకుంటున్నారని చెప్పారు. వాటర్లో నీళ్ళు కలుపుకునే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పృహలో లేనట్టుందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఆగుతాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మంత్రికి తన శాఖలపై పట్టు రాలేదన్నారు. వాటిపై అవగాహన పెంచుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు జగదీశ్ రెడ్డి. ఎవరి ఫ్యాన్స్ వారికి ఉంటారన్నారు.
కాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా అని ప్రశ్నించారు . కేవలం సెన్సేషన్ కోసం డైలాగులు మాట్లాడొద్దంటూ హితవు పలికారు కోమటిరెడ్డిని ఉద్దేశించి. పది రోజుల తరువాత పవన్ మాటలపై మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగదీశ్ రెడ్డి. కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు . ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడిపడం కష్టమేనని అన్నారు .కాంగ్రెస్ నేతలకు తెలంగాణ హక్కులు , ఆకాంక్షల పట్ల బాధ్యత లేనట్లు కనిపిస్తుందన్నారు. దందాలు చేస్తూ రాష్ట్రాన్ని మరచి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
