నల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ హత్యల పరంపర కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందని నేను ఆ రోజే చెప్పానని అన్నారు. బుధవారం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పేరుకే ప్రజా పాలన అని పూర్తిగా హత్యలకు కేరాఫ్ గా మారి పోయిందని మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఇదే సమయంలో ఈరోజు ఇంకో హత్య జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. ఈ రాష్ట్రాన్ని హత్యలకు కేరాఫ్ గా మారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఈ గడ్డపై గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి ఉందని ఆరోపించారు జగదీశ్ రెడ్డి. తాము గత పదేళ్లలో ఆ సంస్కృతిని రూపు మాపడానికి ఎంతో కృషి చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ హత్యలు మొదలు పెట్టారని భగ్గుమన్నారు జగదీశ్ రెడ్డి. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి తమ పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు. మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి కేటీఆర్ వస్తానన్నారని, కానీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల వేళ పరిస్థితులు ఉద్రిక్తం అవ్వకూడదని తామే వద్దని చెప్పామన్నారు. తర్వాత పరమర్శించాలని కోరాం అన్నారు.
















