హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తాము అధికారంలోకి వచ్చాక నువ్వు చేసిన అక్రమాలను కక్కిస్తామని అన్నారు. ఫుట్ బాల్ మ్యాచుల మీద పెట్టిన రూ.110 కోట్ల మీద ఎంక్వయిరీ వేసి మిమ్మల్ని బొక్కలో వేయడం ఖాయమన్నారు. ఎవని అయ్య సొత్తు అని 10 కోట్ల రూపాయల సింగరేణి సొమ్ముతో మెస్సీతో ఫుట్ బాల్ ఆడినవో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవన్నారు. కానీ నువ్వు, నీ మనుమడు ఫుట్ బాల్ ఆడి ఫోటోలు దిగడానికి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటావంటూ నిలదీశారు. సీఎం అన్న సోయి లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు వాగడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రం పట్ల సోయి ఉన్నోడివైతే నీటి హక్కుల గురించి మాట్లాడేటోనివని అన్నారు హరీశ్ రావు.
శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని రేవంత్ రెడ్డి చెప్పి, ఈరోజు జర్నలిస్టులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నాడని ఆరోపించారు. సింగరేణిలో క్యాన్సర్ వచ్చిన వాళ్లను, గుండెకు బైపాస్ సర్జరీ చేసిన వాళ్లను, కాళ్లు కండ్లు లేని వాళ్లను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్గా ఉన్నారంటూ ఉద్యోగం చేసుకోమని అంటున్నారని ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.















