హైదరాబాద్ : ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని పదే పదే ఎద్దేవా చేస్తూ నీచాతి నీచంగా కామెంట్స్ చేస్తూ వచ్చిన సీఎం ఎ. రేవంత్ రెడ్డికి , ఆయన అమితంగా ప్రేమించే గురువు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం మరోసారి ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. నిన్నటి దాకా ఓ లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క అని అన్నారు. ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డిని వెనుక ఉండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరితోనైనా పెట్టుకుంటే వర్కవుట్ అవుతుందని కానీ తనతో పెట్టుకుంటే సీన్ రివర్స్ కావడం పక్కా అని తేల్చి చెప్పారు.
గోబెల్స్ ప్రచారాలకు కేరాఫ్ చంద్రబాబు అని మండిపడ్డారు. సూది నుంచి నేటి కంప్యూటర్ దాకా తానే కనుగొన్నానని బిల్డప్ ఇస్తాడని అన్నారు. ఫ్యూచర్ సిటీని ఆయన తొక్కలో సిటీ అంటూ పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ పేరుతో బాబు చేసిన హంగామా మామూలు కాదన్నారు. ఇలాంటివి చేయడంలో , జిమ్మిక్కులు చేయడంలో తనకు తనే సాటి అంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్. విచిత్రం ఏమిటంటే దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాల్సింది పోయి వంట మనుషులు, సప్లయ్ చేసే వాళ్లతోటి ఎంఓయూలు చేసుకున్న ఘనుడు బాబు అంటూ ఫైర్ అయ్యారు. తను ఓ వైపు బీజేపీతో అంటకాగుతూ చిల్లర వేషాలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.















