హైదరాబాద్ : తన సారథ్యంలోని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తీసుకు వచ్చిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని చెప్పారు. దళిత, గిరిజన, బహుజన మహిళా వర్గాలకు, కుల వృత్తులకు, గ్రామీణాభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం, తెలంగాణ పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని అన్నారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను కేసీఆర్ శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంచారు . ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి, పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని గ్రామస్థులు కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

















