అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగ పుత్రుల కుటుంబాలకు తీపి కబురు చెప్పింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా సహాయం విడుదల చేసినట్లు వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 సంవత్సరం నుండి వివిధ దశలలో పెండింగ్లో ఉన్న ఈ కేసులను ప్రత్యేకంగా పరిశీలించడం జరిగిందన్నారు. మొత్తం రూ. 4.75 కోట్లు మంజూరు చేసి విడుదల చేశామన్నారు అచ్చెన్నాయుడు.
పెండింగ్ ఫైళ్లను వేగవంతంగా పరిష్కరించి, 95 మంది లబ్ధిదారులలో 90 మంది కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఎక్స్గ్రేషియా మొత్తాలు జమ చేయబడినట్లు వెల్లడించారు. మిగిలిన 5 మంది లబ్ధిదారుల ఖాతా వివరాల్లో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా జమ ప్రక్రియ పూర్తి కాలేదని అన్నారు.వాటిని త్వరితగతిన పరిష్కరించి మొత్తాలను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. బాధిత కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


















