విజయవాడ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ పని తీరుపై స్పందించారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు. కావాలని కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు జగ్గారెడ్డి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దోస్తీ ఉందని మరి ఎందుకు ప్రైవేటీకరణ ఆపలేక పోతున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై ముందు మీ ఇద్దరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పని చేస్తున్నారో తెలియాలని అన్నారు. ఏపీలో పాలకులు మారినా ప్రైవేటీకరణను ఆపలేక పోయారంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి.
ఈ విషయంలో మాట మార్చిన చంద్రబాబు నాయుడుకు , మాజీ సీఎం జగన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేనే లేదని స్పష్టం చేశారు. మాకు ఏపీ రాష్ట్రం కూడా అభివృద్ది కావాలన్నారు. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటారని, దీనిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనంటూ పేర్కొన్నారు జగ్గారెడ్డి. గతంలో సీఎంలుగా ఉన్న సమయంలో జగన్ , కేసీఆర్ లు ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరిపారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కావాల్సిందల్లా ఇరు ప్రాంతాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పొద్దస్తమానం కొట్లాడుకుంటే పనులు సాగవన్నారు. సమస్యలకు పరిష్కారం లభించిందని కుండ బద్దలు కొట్టారు జగ్గారెడ్డి.
