వనపర్తి జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిల్లల చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో గౌరవం పొందాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్షా 8 వేలు ఖర్చు చేస్తుందని చెప్పారు. కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. చదువొక్కటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. చదువే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యా శాఖపై నిర్లక్ష్యం వహించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖకు సీనియర్ అధికారులను నియమించాం అని తెలిపారు సీఎం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నానని చెప్పారు. అందుకే విద్యాశాఖను నాదగ్గరే పెట్టుకున్నానని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలకు, త్యాగాలకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరారు. అమరుల ఆశయాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని అన్నారు సీఎం. మౌలిక వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు.
ఇంటి పేర్లు నీళ్లు అని పెట్టుకున్నోల్లు కూడా ఈ పాఠశాల గురించి ఆలోచన చేయలేదని ఆయన మాజీ మంత్రి సింగిరెడ్డి (నీళ్ల) నిరంజన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. కానీ మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ పాఠశాల భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకపోతే వందేళ్లయినా సమస్య పరిష్కారమా కాదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాం అన్నారు. మొదట ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తి చేసి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు.

















