హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఉన్నట్టుండి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేని కోసం వీరు నిరసన తెలిపారో చెప్పాలన్నారు. మరో వైపు ఇదే పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరయ్యారో కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. చిల్లర రాజకీయాలకు వేదికగా వాడుకోవడం మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్. దీని వల్ల సమ్మిట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న సదస్సు అని, ఆ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఆందోళనల కోసం ఇటువంటి ప్రపంచ వేదికలను ఉపయోగించడం వల్ల అంతర్జాతీయంగా దేశాన్ని తక్కువగా అంచనా వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఏఐ సమ్మిట్లో ప్రసంగిస్తున్నప్పుడు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదం సహజమే అయినప్పటికీ, ఎక్కడ, ఎలా నిరసన తెలియజేయాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు కేటీఆర్. రాజకీయ భిన్నాభిప్రాయాలకు ఒక సమయం,ప్రదేశం ఉంటుందని అన్నారు.
