DY CM Pawan : అమరావతి : కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మించి దీవుల్లోని గ్రామాలు అనుసంధానం చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల (DY CM Pawan). మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. గత వారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సమయంలో నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 60 వేల మందికి పైగా సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.
DY CM Pawan Kalyan Key Update
నష్ట పోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పని చేయక పోవడం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవి పూర్తిగా పని చేయకుండా పోయాయన్నారు. గ్రీజ్ పెట్టడం వంటి కనీస నిర్వహణ పనులకు కూడా నోచుకోలేదన్నారు. ఫలితంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లు మొరాయించడం వల్ల సముద్రం పోటెత్తిన ప్రతిసారి ఉప్పు నీరు తమ పొలాలను ముంచెత్తుతుందని తమ సమస్యకు పరిష్కారం చూపమని దివిసీమ రైతులు కోరారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆరోపించారు.
Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : జగన్ రెడ్డిని జనం నమ్మరు : అచ్చెన్న

















