కేరళ : ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, నిర్మాత రంజిత్ ను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు. తను దర్వకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో నటిస్తున్న ఓ హీరోయిన్ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశాడని, ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వాపోయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనను అదుపులోకి తీసుకున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. నటి, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం (మహిళల గౌరవానికి భంగం కలిగించడం), లైంగిక దాడి, అక్రమ నిర్బంధం, అసభ్య సంజ్ఞలు చేయడం వంటి పలు సెక్షన్ల కింద దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా కేరళ లోని తొడుపుళ పోలీసు అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, రంజిత్ను తొడుపుళ పోలీస్ స్టేషన్ నుండి కొచ్చికి తరలించారు. ఆ తర్వాత, చట్టం ప్రకారం తప్పనిసరి అయిన వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఆయన్ని ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రంజిత్ ఇటువంటి ఆరోపణలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2024లో, బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర తనపై వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు, ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు; అయితే, ఆ సమయంలో ఆయన ఆ ఆరోపణలను ఖండించారు. గతంలో జరిగిన ఈ వివాదం కేరళ సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది; పలువురు నటీనటులు, దర్శకులు, సినీ పరిశ్రమ సభ్యులు బహిరంగంగా ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు.



















