హైదరాబాద్ : ప్రముఖ మలయాళ దర్శకుల ద్వయం సిద్ధిక్-లాల్ 1989లో ‘రామ్జీ రావ్ స్పీకింగ్’ అనే హాస్య చిత్రాన్ని రూపొందించారు. ఇది 1971 నాటి అమెరికన్ టీవీ చిత్రం సీ ది మ్యాన్ రన్స్ ఆధారంగా రూపొందించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని, ప్రియదర్శన్ 2000 సంవత్సరంలో హిందీలో ‘హేరా ఫేరీ’ పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు తదితరులు నటించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో శివాజీ, లయ హీరో హీరోయిన్లుగా ‘మిస్సమ్మ’ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్మాత బి. సత్యనారాయణ భావించారు. అప్పట్లో శివ నాగేశ్వరరావు మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి, శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ‘వన్ బై టు’ మంచి విజయాన్ని సాధించింది. అందుకే అదే కాంబినేషన్లో దీనిని రీమేక్ చేయాలని అనుకున్నారు.
ఇదిలా ఉండగా జె.డి. చక్రవర్తికి బదులుగా శ్రీకాంత్, సునీల్లతో ఈ సినిమా చేయాలని కొందరు సలహా ఇచ్చారు. కానీ చివరికి ఆ అవకాశం ‘అల్లరి’ నరేష్ను వరించింది. అప్పటికే నరేష్ ‘అల్లరి’ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే ఆయన వెంటనే అంగీకరించారు. మరో హీరోగా ఆదిత్య ఓం, హీరోయిన్గా అంకిత ఎంపికయ్యారు. వీరు అప్పటికే ‘లహరి లహరి లహరిలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. వీరికి ఇది రెండవ సినిమా. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్ర కోసం తెలుగులో మొదట కోట శ్రీనివాసరావును ఎంపిక చేశారు. రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర కోసం సీనియర్ నరేష్ను తీసుకున్నారు. ఈ చిత్రానికి ‘ధనలక్ష్మి ఐ లవ్ యు’ అనే పేరు పెట్టారు. నిర్మాత చాలా తెలివిగా ‘రామ్జీ రావ్ స్పీకింగ్’ రీమేక్ హక్కులను 30 వేలకు కొనుగోలు చేశారు. కానీ బయట మార్కెట్లో ‘హేరా ఫేరీ’ రీమేక్ అనే ప్రచారం జరిగింది. దీనివల్ల వ్యాపారం కూడా మెరుగ్గా సాగింది. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు 40 లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని నిర్మాత ప్రకటించారు.
