హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రారంభానికి సిద్దమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ లకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కు 20 వేల మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేందుకు గాను ఎన్నికల సంఘం సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని రికార్డింగ్ కూడా చేస్తారు.
ఈవీఎంలు కాకుండా పూర్తిగా ఓట్లను బ్యాలెట్ ద్వారా వేయడంతో ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇక మొదటి ట్రెండ్ రావడానికి రెండు గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా. సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా ఈనెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. అదే రోజు కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జరుగుతాయి. ఇక ఓట్ల లెక్కింపు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ చేయాలని ఇప్పటికే సర్కార్ ఆదేశించింది.
















