ఢిల్లీ : తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ సాక్షిగా. ప్రధానంగా
దేశ వ్యాప్తంగా సిజేరియన్ డెలివరీల పెరుగుదలపై నిలదీశారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్న అంశంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇది తల్లులు, శిశువులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రజా సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో సిజేరియన్ డెలివరీలు గణనీయంగా పెరిగాయన్నారు. 2008–09 సంవత్సరంలో సుమారు 10 లక్షల సిజేరియన్ డెలివరీలు నమోదు కాగా, 2024–25 నాటికి ఈ సంఖ్య 54 లక్షలకు పైగా పెరిగిందని వెల్లడించారు. అయితే మొత్తం ప్రసవాల సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా, సిజేరియన్ డెలివరీల వాటా మాత్రం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని స్పష్టం చేశారు ఎంపీ. ఈ పెరుగుదల ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు ప్రభుత్వం అంగీకరించింది.
సిజేరియన్ డెలివరీలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తల్లి వయస్సు ఎక్కువగా ఉండటం, ఒకేసారి జంట లేదా ఎక్కువ గర్భధారణలు, శిశువుకు ఇబ్బందులు ఏర్పడటం, గతంలో సిజేరియన్ జరగడం, ప్రసవం ఆలస్యం కావడం, ప్లాసెంటా సంబంధిత సమస్యలు వంటి వైద్య కారణాలతో పాటు, కొన్ని సందర్భాల్లో రోగులు లేదా వారి కుటుంబ సభ్యుల అభిరుచులు కూడా నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయని వివరించింది.

















