అమరావతి : గత పాలనలో ఏపీ అన్ని రంగాలలో వివక్షకు లోనైందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేశాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుతో తాను కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఆనాటి రోజులు తలుచుకుంటే బాధ కలుగుతోందన్నారు. 2019 -24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉందన్నారు. విశాఖ వెళ్తే పవన్ కల్యాణ్ను అడ్డుకున్నారు. గతంలో మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తులు ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజలు ప్రతీ అంశాన్నీ గమనిస్తూనే ఉంటారని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు . రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వస్తూనే 7 శ్వేత పత్రాలను విడుదల చేశాం అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియ చేస్తు్న్నానని ప్రకటించారు సీఎం. సంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలనను అందిస్తున్నాం అన్నారు. నెలకు రూ.2,750 కోట్ల రూపాయల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
