హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కె. రామకృష్ణారావు పదవీ కాలం పూర్తయింది. అయినా కేంద్రంతో మాట్లాడి తన పదవీ కాలం పొడిగించారు. ప్రస్తుతం శాసన సభ, శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతో బడ్జెట్ తయారీ, ఆమోదం పొందాలన్న నెపంతో మరోసారి సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దీంతో సీఎం అభ్యర్థన మేరకు మరో మూడు నెలల పాటు రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ ఒకటి నుండి జూన్ 30 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు . కాగా గతేడాది ఆగస్టు లో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే ఆయనను మరికొంత కాలం కొనసాగించాలని భావించిన సీఎం.. ఏడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించారు. దాని ప్రకారం సెప్టెంబర్ 2025 నుండి మార్చ్ 31 వరకు పొడిగింపు పదవి కాలం కొనసాగుతోంది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో రెండవసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సిఎస్ పదవి కోసం పోటీ పడుతున్న సీనియర్ ఐ ఏ ఎస్ లకు ముఖ్యమంత్రి నిర్ణయం మింగుడు పడని వ్యవహారంగా తయారైంది.
