చెన్నై : పాలకులు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చని ఆచరణలో చేసి చూపిస్తున్నారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన అనుకున్న సమయం కంటే ముందే సచివాలయానికి చేరుకుంటున్నారు. ఠంచన్ గా తన టైమ్ ను పాటిస్తున్నారు. దీంతో నిన్నటి దాకా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైన ఉద్యోగులకు సీఎం సమయ పాలన ఆశనిపాతంలా మారింది. ఇక ఇండియాలో రాజకీయ నాయకుల రాకపోకలకు సాధారణంగా సమయపాలన ఉండదనేది ఒక అలిఖిత నియమం. కానీ ముఖ్యమంత్రి విజయ్ ఆ పద్ధతిని మార్చేశారు. సరిగ్గా ఉదయం 10 గంటలు కాగానే, సచివాలయ ద్వారం వద్ద ముఖ్యమంత్రి కారు వచ్చి ఆగుతుంది. 10 గంటలకే తన సీటులో కూర్చుని, సాయంత్రం 5 గంటల వరకు అలసి పోకుండా ప్రజా విధుల్లో నిమగ్నమవుతున్నారు సీఎం.
ఈ దినచర్యలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఆయన భోజన విరామ సమయం. భోజనం కోసం గంటల తరబడి గడిపే సాధారణ పద్ధతికి భిన్నంగా, ఆయన కేవలం 30 నిమిషాల్లోనే మధ్యాహ్న భోజనాన్ని ముగిస్తారు. అదీ బయటకు ఎక్కడికీ వెళ్లకుండా… కార్యాలయంలోనే సాదాసీదాగా భోజనం చేసి, వెంటనే ఫైళ్ల పరిశీలనలో నిమగ్నమవుతారు . ముఖ్యమంత్రిలో వచ్చిన ఈ స్పష్టమైన మార్పును చూసి మంత్రులు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఒక కార్పొరేట్ సంస్థ సీఈఓ మాదిరిగా, సమయాన్ని ఇంత కచ్చితంగా పాటించే ముఖ్యమంత్రిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పని చేయడం సాధారణ విషయం కాదు. “గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా పనిచేశారా?” అని వారు ఆశ్చర్యంతో ప్రశ్నించు కుంటున్నారు.
ముఖ్యమంత్రి సమయపాలన ప్రభుత్వ అధికారులలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. సీఎం కార్యాలయానికి అంత కచ్చితమైన సమయానికి రావడం వల్ల, అధికారులు కూడా సమయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మొత్తం సచివాలయం కొత్త ఉత్సాహంతో పని చేయడం ప్రారంభించింది. “సమయం ప్రజలది, దానిని వృథా చేయకూడదు” అనే దృఢమైన నమ్మకంతో ముఖ్యమంత్రి విజయ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ “కొత్త సంస్కృతి” తమిళనాడు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన మార్పును తీసుకు వస్తుందని భావిస్తున్నారు.


















