అమరావతి : ఏపీ రాష్ట్ర అభివృద్దిలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. సాగు చేయడంలో టెక్నాలజీని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, దీని వల్ల సమయం వృధా కాదన్నారు. పని త్వరగా పూర్తవుతుందన్నారు. దీనిపై కూడా త్వరలో రైతులకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ సర్కార్ పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే జగన్ రెడ్డికి బుద్ది చెప్పారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అయినా తను మారడం లేదన్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించేలా తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు . గతానికంటే రెండు రెట్లు అభివృద్ధి-సంక్షేమం చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చానని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉన్నామన్నారు. ఇప్పటికే ఏపీ దేశంలోనే రోల్ మోడల్ గా మారనుందన్నారు. విశాఖ సమ్మిట్ ద్వారా 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని చెప్పారు. నాడు చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అన్నదాత సుఖీభవ అమలు చేశామన్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా అందరికీ రూ. 15 వేలు ఇవ్వడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
దివ్యాంగులకు పెన్షన్లు పెంచామని, అంతే కాకుండా మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు సీఎం. దీంతో పాటు దీపం-2.0 పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నామని, అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామన్నారు. గోతుల పడ్డ రోడ్లను పూడుస్తున్నామని, సంక్రాంతి నాటికి రోడ్లపై గోతులు లేకుండా చేస్తామ్నారు.

















