అమరావతి : దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్పందించారు. C DOT-అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో SRM అమరావతిలో టెస్ట్ బెడ్ ఏర్పాటుకు పని చేస్తున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్లకు అమరావతి కేంద్ర బిందువు కానుందని వెల్లడించారు. ప్రపంచ టెలి కమ్యూనికేషన్-ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. సురక్షితమైన సమాచార మార్పిడి, విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ రెసిలియన్స్ అనేవి దేశాల భవిష్యత్తుకు ఎంత కీలకమో అనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు సీఎం. టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, క్వాంటం, ఐటీ రంగాల్లో అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందన్నారు.
గత ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవం తర్వాత ఆయా రంగాల్లో కీలక అడుగులు పడుతున్నాయని తెలిపారు సీఎం. కమ్యూనికేషన్స్, సైబర్ స్పేస్ కోసం దేశంలోనే మొట్టమొదటి క్వాంటం-సెక్యూర్ కమ్యునికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుందని ప్రకటించారు. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన C-DOT, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో అమరావతిలోని SRM యూనివర్శిటీలో ఈ టెస్ట్ బెడ్ ఏర్పాటు చేస్తోందన్నారు సీఎం. క్వాంటం కమ్యూనికేషన్ హార్డ్వేర్, ఫోటోనిక్, ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్, సురక్షిత నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్-జనరేషన్ సైబర్ రక్షణ పరిష్కారాల పరిశోధన, పరీక్షలకు ఈ టెస్ట్ బెడ్ ఎంతగానో తోడ్పడుతుందని వెల్లడించారు.
ఈ తరహాలో టెస్ట్ బెడ్ ల ఏర్పాటుతో మేక్ ఇన్ ఇండియా సాంకేతికతలు, సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో అమరావతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుందన్నారు చంద్రబాబు నాయుడు. ఫ్రంటియర్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ ఆవిష్కరణలకు అమరావతి ప్రముఖ కార్యస్థానంగా ఆవిర్భవిస్తుందన్నారు. ప్రపంచ భవిష్యత్తును మార్చే సాంకేతికతలను రూపొందించడంలో ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలు భాగస్వాములు కావడానికి ఇది సరికొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు సీఎం.
