అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేవారు. ప్రతీ నెల నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుది రూపు ఇచ్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్మెంట్తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని ఈ ఐదు పాపులేషన్ మేనేజ్మెంట్కు మూల స్తంభాలన్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మహిళల వర్క్ ఫోర్స్ ప్రస్తుతం కేవలం 31 శాతం మాత్రమే ఉందన్నారు. ఇది 59 శాతాన్ని చేరుకుంటే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుందని చెప్పారు.
గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి జీవిత దశలోనూ ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు సీఎం. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతిస్తాం అని ప్రకటించారు. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు పీపీపీ విధానంలో అందిస్తామని తెలిపారు.. సిజేరియన్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. అలాగే, ప్రస్తుతం 8.8 శాతం ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం లోపు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 50 మంది చిన్నారులు, మహిళలు ఒక ప్రాంతంలో ఉంటే చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం అన్నారు. షి క్యాబ్లు అందుబాటులోకి తెస్తాం అన్నారు.
