హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలనలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం తెలంగాణ పేరుతో కాలయాపన చేసిందని, ఆస్తులను పోగేసుకున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ సర్కార్ జాబ్స్ ను రిక్రూట్ చేశామన్నారు. ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు సీఎం. ప్రభుత్వ ఆధీనంలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో 15,780 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ( టీజీఎస్ఎల్పీఆర్బీ) 16,067 పోస్టులు భర్తీ చేశామన్నారు. వైద్య, ఆరోగ్య నియామక బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ ) 8,666 జాబ్స్ ను రిక్రూట్ చేసినట్లు తెలిపారు.
అంతే కాకుండా తెలంగాణ నివాస విద్యా సంస్థల నియామక బోర్డు ( టీఆర్ఈఐఆర్బీ) ద్వారా 8,400 పోస్టులు భర్తీ చేయబడ్డాయని స్పష్టం చేశారు అనుముల రేవంత్ రెడ్డి. విద్యా రంగం పరంగా 10, 006 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 1,005 జాబ్స్ ను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు సీఎం. సింగరేణి, ఇతర సంస్థల ద్వారా 1,355 పోస్టులను భర్తీ చేశామన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రజా పాలనలో ఇప్పటి వరకు రెండేళ్ల కాలంలో 61,379 కొలువులు నింపామన్నారు సీఎం. ప్రస్తుతం ప్రక్రియలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖలలో 7,267 పోస్టులు భర్తీ చేశామన్నారు.

















