హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వాటిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యరు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని, వీటిని తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి చోటా కాంగ్రెస్ జెండా ఎగరాలని , రెప రెప లాడాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలన్నారు. సత్తా చాటేందుకు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని కోరారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎంతో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, మహమ్మద్ అజారుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, ఏఐసీసీ నాయకులు ప్రవీణ్ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవ రావు, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యులు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
